Sunday, July 26, 2009

ముదిగొండ నరమేధం జరిగి రేపటికి రెండేళ్లు


ముదిగొండ నరమేధం జరిగి రేపటికి రెండేళ్లు
ముదిగొండ నరమేధం జరిగి రేపటికి రెండేళ్లు
-సస్పెండైన అధికారులకు పోస్టింగులు
-కొనసాగుతున్న నిర్బంధం
-రేపు 2వ వర్థంతి సభ
-హాజరు కానున్న త్రిపుర సిఎం, బివిఆర్‌, తమ్మినేని

రాష్ట్ర ప్రభుత్వం సాగించిన ముదిగొండ నరమేధానికి మంగళవారంతో రెండేళ్లు కాబోతోంది. భూపోరాటం అణిచివేతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సాగించిన దారుణ మారణకాండలో ముదిగొండలో ఏడుగురు ఉద్యమ కారులు బలయ్యారు. ఈ ఘటనకు బాధ్యులుగా అప్పటి అడిషనల్‌ ఎస్‌పి రమేష్‌బాబు, సిఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకట్‌రెడ్డిలను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఏడాది తిరగక మునుపే వారికి వరంగల్‌ రేంజ్‌లో పోస్టింగులు ఇచ్చింది. 2008 జూలై 28న ముదిగొండ సిపిఎం నేతలపై ప్రారంభమైన నిర్బంధం నేటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమరులను స్మరించడంతో పాటు ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సంస్మరణ సభను 28న నిర్వహించనున్నారు. ఈ సభకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌తో పాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బివి.రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం తదితరులు హాజరు కానున్నారు.
రెండేళ్ల క్రితం జరిగిన పోలీసుల కాల్పుల ఘటనలో ఏడుగురు చనిపోయారు. మరో 13 మందికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. రాష్ట్రబంద్‌లో భాగంగా ప్రశాంతంగా జరుగుతున్న రాస్తారోకోలో రాజకీయ రహితంగా జనం పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అతి చిన్న రహదారి, అంతటా బంద్‌ కావటంతో పెద్దగా వాహనాలు నిల్వలేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరుగలేదు. రాస్తారోకోలో భాగంగా సభ జరుగుతున్న సమయంలో మొదట స్థానిక పోలీసులు వచ్చి విరమించాల్సిందిగా కోరారు. అందుకు ఆందోళనా కారులు నిరాకరించారు. వారు వెనుదిరిగారు. అటు తర్వాత కొద్ది సేపటికి అదనపు ఎస్‌పి రమేష్‌బాబు, స్పెషల్‌పార్టీ పోలీసులతో అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి హెచ్చరికలూ లేకుండా మొదట లాఠీఛార్జి, అటు తర్వాత యథేచ్ఛగా కాల్పులు జరిపించారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ముదిగొండ బస్టాండ్‌ ప్రాంతం రక్తసిక్తమైంది. బాధితుల
ఆర్తనాధాలు, పాలనా యంత్రాంగంపై మహిళలు పెట్టిన శాపనార్ధాల కేకలతో భీకర వాతావరణం నెలకొంది.
ప్రపంచ వ్యాపిత నిరసన
ముదిగొండ వరుస పరిణామాలను ఈటివి-2కి చెందిన కెమెరామెన్‌ రామారావు సమీపంలోని చెట్టు నుండి చిత్రీకరిం చారు. మిగతా సిబ్బంది ఎప్పటికప్పుడు నిరంతర ప్రసారానికి సహకరించారు. దీంతో ఘటన విషయం కొన్నిక్షణాల్లో విశ్వ వ్యాపితంగా ప్రాచుర్యమైంది. ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. గంటల్లో వందల, వేలల్లో జనం రాజకీయ రహితంగా ముదిగొండ చేరుకున్నారు. పాశవికచర్యగా అభివర్ణించారు. బాధితులకు, ఉద్యమకారులకు బాసటగా నిలిచారు.
పరిహారం కోసం పోరాటం
కాల్పుల ఘటనలో చనిపోయిన, గాయపడిన వారి కుటుంబాలకు పరిహరం విషయంపై భారీ పోరాటం నడిచింది. కాంగ్రెస్‌ మినహా అన్ని పక్షాలూ ఆందోళనలో పాలు పంచుకున్నాయి. కొంతమంది కాంగ్రెస్‌ నేతలు వ్యక్తిగతంగా బాసటగా నిలిచారు. 26 గంటల పాటు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట మృతదేహాలుంచి జోరువానలోనే ధర్నా చేశారు. జిల్లా నలుమూలల నుండి పెద్దఎత్తున జనం కదిలొచ్చారు. ధర్నాను భగం చేయడానికి పోలీసులతో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. చివరికి ప్రభుత్వం దిగివచ్చి పోలీసు అధికారులను సస్పెండ్‌ చేసి, పరిహారం ప్రకటించింది.
కొనసాగుతున్న నిర్బంధం
రెండేళ్లు పూర్తి కావస్తున్నా ముదిగొండలో నేటికీ నిర్బంధం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా సిపిఎం ముఖ్య నాయకత్వం టార్గెట్‌గా చర్యలు జరుగుతున్నాయి. కాల్పుల సందర్భంలో సిపిఎం జిల్లా నాయకులు బండి రమేష్‌ టార్గెట్‌గా పోలీసులు వ్యవహరించారు. అటు తర్వాత అనేక కేసులు పెట్టారు. ప్రస్తుతం చిరుమర్రిలో అధికారపార్టీ నేతలకు ఎదురైన పరాభావ ఘటనకు సంబంధం లేకపోయినా బండి రమేష్‌పై 302 సెక్షన్‌ కింద కేసుపెట్టి జైలుకు పంపారు. ఇలాంటివి నిర్బంధ చర్యలను స్పష్టం చేస్తున్నాయి.
(మరికొన్ని వివరాలు రేపటి సంచికలో)

No comments:

Post a Comment